మొన్న ఆ మధ్య టాలీవుడ్ పెద్దలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి షూటింగులకు పర్మిషన్ అడిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండస్ట్రీ పెద్దలతో ముఖ్యమంత్రి మరోసారి భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా పిక్కల్లోతు కష్టాలలో ఉన్న ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ కలిసినట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ నుండి ఈ సంవత్సరం ఆఖరు వరకు థియేటర్ల కరెంట్ బిల్లులు మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లు ఓపెన్ కాగానే విద్యుత్ బిల్లుల మాఫీ జీవో ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీ మాఫీ చెయ్యమని కోరగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారట.
అలాగే మల్టిప్లెక్స్, థియేటర్ యాజమాన్యాలు పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించగా… థియేటర్లను ఆదుకునేందుకు పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునే అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేదాని మీద ముఖ్యమంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదట.
ఇది ఇలా ఉండగా సాధారణంగా ముఖ్యమంత్రిని ఇండస్ట్రీ పెద్దలు కలిస్తే ఆర్బాటంగానే కలుస్తారు. మీడియాలో విస్తృతమైన కవరేజ్ ఉంటుంది. అయితే ఈ మీటింగ్ అయ్యాకా కూడా కనీసం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా విడుదల కాలేదు. అంత సీక్రెట్ ఎందుకు కలవాల్సి వచ్చింది అని అంతటా చర్చ జరుగుతుంది.