rumours-sai-pallavi-used-to-come-to-the-sets-lateశేఖర్ కమ్ముల సృష్టించిన “ఫిదా” సినిమా తర్వాత సాయి పల్లవి అనే పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన విషయం తెలిసిందే. ఆ “ఫిదా” ప్రభావంతోనే ఆమె నటించిన గత సినిమాలు ప్రస్తుతం తెలుగులోకి డబ్ అవుతూ వస్తున్నాయి. అంతటి ప్రభావం సృష్టించిన సాయిపల్లవి పోకడ మాత్రం ప్రస్తుతం ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారడం, ఆమె భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసేలా కనపడుతోంది.

“ఫిదా” సూపర్ సక్సెస్ తర్వాత ప్రస్తుతం నానితో “ఎంసీఏ” మరియు నాగశౌర్యతో మరో చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లకు సాయిపల్లవి చాలా ఆలస్యంగా వెళుతూ చిత్ర యూనిట్ సభ్యుల సహనాన్ని పరీక్షిస్తోంది అన్నది ప్రముఖ ఆంగ్ల పత్రిక తాజా కధనం. దీంతో సాయిపల్లవి వ్యవహార తీరు సర్వత్రా హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇప్పటికే తెలుగు నాట స్టార్ హీరోగా మారిన నాని షూటింగ్ కు సమయానికి వస్తుంటే, ఆమె కోసం వేచిచూడడం నాని వంతవుతోందన్నది సదరు కధనం సారాంశం. మరో హీరో నాగశౌర్య పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కేవలం ఒకే ఒక్క హిట్టుతో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు, హీరోలకు చుక్కలు చూపిస్తున్న సాయిపల్లవి తీరు నచ్చకే దిల్ రాజు తన తాజా చిత్రంలో సాయిపల్లవికి అవకాశం ఇవ్వలేదన్నది మరో న్యూస్.

‘ఓవర్ నైట్’ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయిపల్లవి నిజంగా ఈ రకంగా వ్యవహరిస్తోందన్నది నిజమే అయితే… అది ఆమె కెరీర్ కు తీవ్ర ముప్పుగా పరిగణించాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే ఎక్కువ ఫేం పొందిన ఈ ‘నాచురల్ బ్యూటీ’ మరి దీనిపై ఎలా వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి. అయితే ఇలా ఒక్క సినిమాతో వండర్స్ సృష్టించి, బాగా పాపులర్ అయ్యి, తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ల జాబితాకు కొదవలేదన్నది టాలీవుడ్ వర్గాల మాట. ఆ జాబితాలో సాయిపల్లవి ఉండకూడదనేది సినీ ప్రియుల ఆకాంక్ష.