రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న “శ్రీవల్లి” ఈ నెల 15వ తేదీన విడుదల కాబోతోంది. అనేక వాయిదాల అనంతరం విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమాపై హైప్ పెంచేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకపై రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు, ‘శ్రీవల్లి’ సినిమా కంటే కూడా, త్వరలో రాజమౌళితో తాను జత కట్టబోతున్నాను అన్న పరోక్ష సంకేతాలనే ఎక్కువగా వ్యక్తపరిచారు.
తన కెరీర్ లో రెండవ సినిమాగా చేసిన “మగధీర” సక్సెస్ కు ఇన్నేళ్ళ తర్వాత ‘శ్రీవల్లి’ ఆడియో వేడుకపై విజయేంద్రప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు రామ్ చరణ్. ఈ వేడుకకు నన్ను పిలవకపోయినా వచ్చి ఉండేవాడినని, ‘మగధీర’ సినిమా తర్వాత విజయేంద్రప్రసాద్ గారితో వేదికను పంచుకోవడం ఇదే తొలిసారని, అందుకే కాస్త ఆలస్యం అయినా, ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నానని చిరుదరహాసం ప్రదర్శించారు మెగా పవర్ స్టార్.
అంతేనా… విజయేంద్రప్రసాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు కూడా! ఆయన పేరే ఈ సినిమాకు పబ్లిసిటీ, నేను ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి రాలేదు, కేవలం విజయేంద్రప్రసాద్ గారికి, రాజమౌళి గారికి థాంక్స్ చెప్పడానికే వచ్చాను… అంటూ పొగడ్తలతో తడిపేసారు. అయితే దీని వెనుక అసలు ఆంతర్యం… రాజమౌళి దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమాలో హీరో చెర్రీనే అని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో… ‘శ్రీవల్లి’ ఆడియో వేడుక దీనిని బలపరిచింది. అంటే మెగా ఫ్యాన్స్ కు సెలబ్రేషన్స్ టైం వచ్చినట్లే కదా!