rumours on ysr biopic yatra-వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్న “యాత్ర” సినిమా షూటింగ్ జూన్ నుండి మొదలు కాబోతోంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో ఎవరెవరు నటిస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎందుకంటే వైఎస్ వారసుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పాత్ర, అలాగే వైఎస్ సతీమణిగా విజయలక్ష్మి పాత్ర, వైఎస్ తనయురాలిగా షర్మిల రోల్స్ చాలా కీలకమైనవి. ఇందులో షర్మిల రోల్ కు సంబంధించి తాజాగా కొన్ని పుకార్లు షికారు చేసాయి.

షర్మిల రోల్ చేయడానికి ప్రముఖ హీరోయిన్ భూమిక ఓకే చెప్పిందని, ఈ పాత్రలో ‘ఖుషి’ బ్యూటీ దర్శనమివ్వనుందన్న టాక్ హల్చల్ చేసింది. అయితే ఇందులో ఇసుమంత వాస్తవం కూడా లేదని దర్శకుడు మహి వి రాఘవ్ స్పష్టం చేసారు. షర్మిల రోల్ కే కాదు, అసలు భూమిక తమ సినిమాలో లేదంటూ వివరణ ఇచ్చారు. దీంతో భూమికపై వచ్చిన వార్త కేవలం ఓ పుకారు మాత్రమేనని తేటతెల్లమైంది. ప్రస్తుతం చిత్ర కాస్టింగ్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసే పనిలో ఉందన్న మాట అయితే వాస్తవం.