rumours on jayalalithaa-houseనంబర్ 81… వేద నిలయం… పోయెస్ గార్డెన్స్… తమిళనాట ఈ చిరునామా గురించి తెలియని వారుండరు. మొన్నటి వరకూ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన చిరునామా ఇది. ‘అమ్మ’ జయలలిత మరణం, ఆపై ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసిలు జైలుకు వెళ్లడంతో ఈ ఇల్లు ఇప్పుడు ‘దెయ్యాల కొంప’లా కనిపిస్తోంది. మూసివేసిన తలుపులు… కనిపించీ కనిపించని వెలుగులు… గుండుసూది కిందపడ్డా వినిపించేటంత నిశ్శబ్దం… ప్రస్తుతం పోయెస్ గార్డెన్స్ లో రాజ్యమేలుతోంది.

ఇంత భారీ భవంతికి సెక్యూరిటీగా ప్రైవేటు సంస్థకు చెందిన గార్డులు కాపలా కాస్తున్నప్పటికీ, రాత్రిపూట గార్డు రూమును దాటి భవంతి వైపు అడుగులు వేసేందుకు వారు కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంటోంది. ఈ భవంతిలోకి వెళ్లే వాళ్లు ఎవరూ లేరని, అసలిక్కడ ఎక్కువ సేపు ఉందామని కూడా ఎవరూ భావించడం లేదని స్థానిక సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. పగటి సమయంలో కొంతమంది పని వాళ్లు వచ్చి భవన నిర్వహణ పనులు చూసుకుని రాత్రి సమయానికి బయట పడిపోతున్నారని వివరిస్తున్నారు.

ఈ నౌకరి చేసే వీరికి గత కొన్ని నెలలుగా జీతాలు కూడా రావడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 15న శశికళ పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తరువాత, చాలా మంది పని వారు మానేశారని, రాత్రి పూట ఉండటం క్షేమకరం కాదని భావిస్తున్నారని నైట్ టైం సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి వ్యాఖ్యానించాడు. కాగా, ఈ భవంతిని జయలలిత స్మారక భవనంగా మార్చాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికైతే జయలలిత మరణించి 5 నెలలు దాటుతుండగా, ఇప్పటికీ ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతోందని నమ్ముతున్న తమిళ ప్రజలు ఎందరో… ఎందరెందరో..!