Rumours Narendra deposited 25000 rupees in bank accountsపెద్ద నోట్ల రద్దుతో ఏకంగా 8 లక్షల కోట్లకు పైగా ధనం బ్యాంక్ ఖాతాలలో వచ్చి పడిన విషయం తెలిసిందే. అయితే “బ్యాంకుల్లోకి వచ్చిన ఈ డిపాజిట్లలో నల్లధనంగా గుర్తించబడి, జరిమానాగా ఖజానాకు వచ్చిన డబ్బు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాకూ 10 వేల నుంచి 25 వేలు వరకు డిపాజిట్ చేయబడ్డాయని” ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయ్యింది.

నోట్ల రద్దు తరువాత ప్రజలు చిల్లర నోట్లకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారిలో కొంత ఉత్సాహం నింపి, కేంద్రంపై ఆగ్రహాన్ని తగ్గించేందుకు ప్రధాని మోడీ తీసుకున్న చర్యల్లో భాగంగా ఇలా డబ్బు డిపాజిట్ చేశారని సెల్ ఫోన్లకు వచ్చిన సమాచారాన్ని చూసి వందలాది మంది బ్యాంకులకు ఉరుకులు పరుగులపై వెళ్లారు. ముఖ్యంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ మెసేజ్ బాగా చక్కర్లు కొట్టడంతో, బ్యాంకుల వద్ద జనం కిక్కిరిసిపోవడం కనిపించింది.

దీంతో బ్యాంకు సిబ్బంది సైతం గందరగోళానికి లోనై, విషయం ఏంటని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆపై అసలు నిజాన్ని ప్రజలకు చెప్పినప్పటికీ చాలా మంది నమ్మని పరిస్థితి నెలకొంది. నగదు డిపాజిట్ జరగలేదని, అలాంటి చర్యలు చేపట్టలేదని బ్యాంకుల వద్ద నోటీసులు అతికించడంతో, వాటిని చూసిన ప్రజలు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇలాంటి పుకార్లను నమ్మి సమయాన్ని వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.