నిత్యం చంద్రబాబుపై మరియు తెలుగుదేశం పార్టీపై విమర్శలు సంధించే నగరి ఎమ్మెల్యే రోజా, మళ్ళీ టిడిపిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోదంటూ పొలిటికల్ వర్గాల్లో ఇటీవల అనూహ్యంగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై తాజాగా స్పందించిన రోజా తెలుగుదేశం పార్టీకి తీపి కబురును అందించినట్లుగా టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం… తిరుమల వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు.
“తాను మరోసారి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తెదేపాలోకి తాను ఫిరాయించనున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని” కుండబద్దలు కొట్టారు. కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇవి నమ్మవద్దని, రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తో పాటే ఉంటానని రోజా చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి రోజా టిడిపిలోకి వస్తుందన్న వార్తలు ఎలా పుట్టుకోచ్చాయో గానీ, రోజా రానుందన్న సమాచారం పట్ల పెదవి విరిచిన టిడిపి నేతలు, కార్యకర్తలే ఎక్కువ. ముఖ్యంగా రాజకీయాల్లో రోజాకు పడిన ‘ఐరన్ లెగ్’ ముద్రతో మరే ఇతర పార్టీలు రోజాను ఆహ్వానించే పరిస్థితి లేదన్నది పొలిటికల్ వర్గాల టాక్. గతంలో చంద్రబాబు బాంబ్ బ్లాస్ట్ అనుభవం, వైఎస్సార్ కాలం చేయడం వంటి ఉదంతాలను రోజా విషయంలో ప్రత్యేకంగా పేర్కొంటుంటారు. మరి అంతటి శక్తివంతమైన రోజా, మళ్ళీ టిడిపిలోకి రాబోవడం లేదన్న ప్రకటనతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.