RRR Promotions will Start after Bheemla Nayak Releaseపవర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రస్తుతం “భీమ్లా నాయక్” సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. గతంలో “అఖండ” సమయంలో ఎలా అయితే టాలీవుడ్ ఆసక్తిగా నిరీక్షించిందో, ప్రస్తుతం “భీమ్లా నాయక్” విడుదల సందర్భంలో కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తితో టాలీవుడ్ వర్గాలు ఉన్నాయి. రాజకీయంగా పవన్ విరోధిగా ఉండడంతో, ‘భీమ్లా’ను నియంత్రించే విధంగా చర్యలు ఏమైనా ఉంటాయా? లేక ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రదర్శితం చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తుందా? అన్న ఆలోచనలలో తెలుగు చిత్ర సీమ ఉంది.

తెలంగాణాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకోగా, ఏపీలో మాత్రం కొత్త జీవో వస్తుందో? లేదో? అన్న సందిగ్ధం నెలకొనడంతో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. నైజాంలో అయితే మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్స్ ఉండొచ్చన్న లెక్కలు కడుతున్నారు. ఇక యుఎస్ లో కూడా పవన్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ ను అందుకునే సినిమాగా ‘భీమ్లా నాయక్’ నిలవనుంది.

‘భీమ్లా నాయక్’ విడుదలైన తర్వాతే తమ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించే పనిలో రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘భీమ్లా’ ప్రమోషన్స్ జరుగుతున్న తరుణంలో, తమ సినిమా ప్రమోషన్స్ ను అందించి, ప్రేక్షకుల దృష్టిని మలిచే ఉద్దేశం లేకనే ‘భీమ్లా నాయక్’ విడుదల కోసం వేచిచూస్తున్నట్లుగా తెలుస్తోంది.

మార్చి 25వ తేదీన విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ పూర్తయ్యాయి. అయితే సంక్రాంతి నుండి వాయిదా పడడంతో, మరోసారి అన్ని ఏరియాలలో ప్రమోషన్స్ ఇచ్చేందుకు రాజమౌళి సిద్ధమైనట్లుగా సమాచారం. అలాగే తెలుగు నాట కూడా భారీ ప్రమోషన్స్ కు ప్లానింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇది విశాఖ తీరాన ఉండనుందని టాక్. ఈ వేడుకలో వైసీపీ వర్గాలు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటికి టికెట్ల కొత్త జీవో వస్తుంది గనుక, ఏపీ ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞత తెలియజేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.