robo 2.0 movie audio launch in dubaiసినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందిస్తున్న 2.0 సినిమా ఆడియో వేడుక నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న దుబాయ్ లో జరగనున్న ఈ వేడుకను వివిధ ప్రత్యేకతలతో రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్ లో నిర్వహించనున్నారు. 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ రెహ్మాన్, శంకర్ లు బస చేసిన హోటల్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి బుర్జ్ దుబాయ్ కి చేరుకుంటారు. ఆ రోజు అంతర్జాతీయ మీడియా సమావేశం నిర్వహిస్తారు.

ఈ మేరకు జరుగుతున్న కార్యక్రమాల హైలైట్స్ ను టీజర్ రూపంలో విడుదల చేయడంతో ఈ ఆడియో వేడుకపై మరింత ఆసక్తి పెరుగుతోంది. బుర్జ్‌ దుబాయ్‌ పార్కు హోటల్‌ లో ఒక సినిమా ఆడియో వేడుక జరిపేందుకు దుబాయ్‌ ప్రభుత్వం అనుమతివ్వడం 2.0తోనే ప్రారంభం కానుంది. ఈ ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 125 సింఫొనీ కళాకారులతో కలిసి సంగీత విభావరి నిర్వహించనున్నాడు. ఈ సందర్భంగా ‘2.0’ సినిమాలోని ఒక పాటకి రెహ్మాన్‌ లైవ్‌ కంపోజింగ్‌ చేయడం. శివాజీ, రోబో, 2.0 సినిమాల్లోని పాటలకు బాస్కో డ్యాన్స్‌ బృందం ప్రదర్శన చేయనుంది.

ఈ ఆడియో వేడుకను 12,000 మంది ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్‌ లోని పెద్ద పెద్ద మాల్స్‌ లో ఈ ఆడియో వేడుక ప్రత్యక్ష ప్రసారానికి భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇందుకు మొత్తమ్మీద 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కోలీవుడ్ టాక్. ఈ ఆడియో వేడుకలో పాల్గొనాల్సిందిగా విశ్వనాయకుడు కమల్ హాసన్ ను శంకర్ స్వయంగా కలిసి ఆహ్వానమందించారు. అలాగే దీనికి ముఖ్యఅతిథిగా దుబాయ్ రాజు హాజరయ్యే అవకాశం ఉండడం విశేషం.