తమిళనాడులోని ఆర్కేనగర్‌ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ స్థానానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదికను పంపింది. దీనిపై మరో సమగ్ర పరిశీలన అనంతరం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.

ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో సోదాలు జరుపగా సుమారు 90 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఓటర్ల కొనుగోలుకు వినియోగించినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఐటీ విభాగం కూడా జాతీయ ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇచ్చింది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఎన్నిక కావడంతో శశికళ వర్గం బరి తెగించి ఓటుకు 4 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తోంది. దీంతో సమావేశమైన ఎన్నికల కమీషన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తమిళనాట భారీ ఎత్తున పంపకాలు జరిపిన నేతలు షాక్ తిన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయంపై శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసీ చరిత్రాత్మక తప్పిదం చేసిందని మండిపడ్డారు. తాము ఏ తప్పు చేయనప్పటికీ, ఈసీ అన్యాయమైన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈసీ నిర్ణయంతో శశికళ వర్గీయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు వారు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంతలోనే ఈసీ కీలక నిర్ణయం తీసుకోవడంతో… వారంతా అవాక్కయ్యారు.