ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గురువారం నాడు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించగా, దీనికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణదీర్ కపూర్, జాకీష్రాఫ్, అర్జున్ రాంపాల్, కబీర్ బేడి తదితరులు మాత్రమే హాజరు కాగా, ప్రస్తుతం స్టార్లుగా వెలుగొందుతున్న మరియు వర్థమాన నటీనటులు ఎవరూ హాజరు కాకపోవడం విశేషం. దీనిపై సీనియర్ నటుడు రిషి కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులతో కలసి తాను విదేశాల్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయానని చెప్పిన రిషి కపూర్.., ఈ తరానికి చెందిన ఒక్క నటుడు కూడా వినోద్ ఖన్నా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అవమానకరమని మండిపడ్డారు. ఆయనతో కలిసి నటించినవారు కూడా అంత్యక్రియలకు రాకపోవడం దారుణమని, ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని ఈ తరం సినీ నటులకు హితవు పలికారు. భవిష్యత్ లో తాను మరణించినా, తన శవాన్ని మోస్తారన్న గ్యారెంటీ లేదని ప్రస్తుత నటీనటులను ఏకరువు పెట్టారు.
సోకాల్డ్ స్టార్స్ పై తనకు చాలా కోపం వస్తోందని అన్న రిషి కపూర్, ఈ మధ్య తాజాగా హాలీవుడ్ కి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి ఈ తరం చెంచా గ్యాంగ్ మొత్తం వెళ్లారని ఎద్దేవా చేశారు. వినోద్ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం హాజరయ్యేందుకు వారికి తీరిక లేకుండా పోయిందని రిషి కపూర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే తమపై ఒక్క మాట కూడా పడనివ్వని ఈ తరం తారలు రిషి కపూర్ కు కౌంటర్ ఇస్తారేమోనన్న టాక్ కూడా వినపడుతోంది