రియో ఒలింపిక్స్ లో భారత్ కు పతకం ఖాయమైపోయింది. కాకలు తీరిన క్రీడాకారులు సాధించలేని ఈ ఫీట్ ను తెలుగమ్మాయి పీవీ సింధు సాధించేసింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో వరల్డ్ నెంబర్ 2 షట్లర్ వాంగ్ ఇహాన్ ను వరుస సెట్లలో సింధు ఓడించిన తీరు యావత్తు భారతావనిని మంత్రముగ్ధులను చేసింది. చివరి పాయింట్ కోసం సర్వీస్ చేసిన సింధు… వాంగ్ నుంచి తిరిగి వచ్చిన కాక్ ను మళ్లీ వెనక్కు పంపింది.
సదరు కాక్ ను మరోమారు సింధు కోర్టులోకి పంపేందుకు వాంగ్ తీవ్రంగా యత్నించింది. కాక్ ను ఒడిసి పట్టేసిన వాంగ్ దానిని బ్యాట్ తో సింధు కోర్టులోకి వేసేయబోయింది. వాంగ్ నుంచి తిరిగి వస్తుందనుకున్న కాక్ కోసం సింధు కూడా అప్రమత్తమైంది. కాక్ పడుతుందని భావించిన ప్రదేశానికి సింధు రానే వచ్చింది. కాక్ కింద పడకుండా చేసే యత్నంలో బ్యాటును ముందుకు సాచిన సింధు… పట్టుతప్పి పడిపోయింది. అయితే ఆ పడడంలోనే ఒక విజయం దాగి ఉందన్న విషయం తర్వాత గానీ అర్ధం కాలేదు.
వాంగ్ నుంచి వస్తుందనునుకున్న కాక్ మాత్రం నెట్ ను తాకి వాంగ్ కోర్టులోనే పడిపోయింది. దీంతో సింధు విజయడంఖా మ్రోగించింది. కిందపడిన స్థితిలోనే విజయం సాధించానని తెలుసుకున్న సింధూ ఆదే స్థితిలోనే సింహనాదం చేస్తూ లేచింది. ఈ గెలుపు ఘడియలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం జాతీయ, లోకల్ మీడియాల్లో వైరల్ గా ప్రసారమవుతోంది.