తన ఆలోచనలు సామాన్యులకు అందేవి కావన్న విషయం రాంగోపాల్ వర్మ మరోసారి నిరూపించే పనిలో ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున విజయవాడ ‘రక్త చరిత్ర’కు నిదర్శనంగా తెరకేక్కిస్తోన్న “వంగవీటి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అయితే ఇది రక్తచరిత్ర కాదు, ఒక ప్రశాంతమైన సినిమా, అందుకనే శాంతికి చిహ్నంగా ఉండే గాంధీ పుట్టినరోజున విడుదల చేస్తున్నాము అంటూ వర్మ అభిప్రాయపడ్డారు.
‘వంగవీటి – దేవినేని’ కుటుంబాల మధ్య జరిగిన కధా సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుండి సంచలనాత్మకమైంది. ముఖ్యంగా వంగవీటి మోహన రంగ అనే పేరు ఇప్పటికీ విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంటోంది. దీంతో మళ్ళీ ఎలాంటి అలజడులు చెలరేగుతాయోనని, సినిమా ప్రారంభించిన తొలినాళ్ళల్లో పలువురు అభిప్రాయ పడ్డారు. కానీ, ఒక్కసారి ఫిక్స్ అయితే వర్మను ఆపడం ఎవరి తరమూ కాదనే విధంగా, అనుకున్న విధంగానే సినిమాను పూర్తి చేసి ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
మరి వర్మ చెప్పినట్లుగా ప్రశాంతంగా ఉన్న ట్రైలర్ దర్శనమిస్తుందో లేక 80వ దశకం చివరిలో ఏపీ రాజకీయాలను కుదిపి వేసిన వంగవీటి మోహన రంగ హత్య ఉదంతంతో నిండి ఉన్న ‘రక్తచరిత్ర’ను చూపిస్తారోనని సినీ అభిమానులతో పాటు, ఏపీ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రంగ హత్యకు గురి కాబడిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడంతో, ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.