వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాలను కులాలను మిక్స్ చేస్తూ చేసిన తాజా వివాదాస్పద చిత్రం.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఆ చిత్రం ట్రయిలర్ ఇటీవలే విడుదలైంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ లను అభ్యంతరకరంగా చూపించాడు వర్మ. కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు వర్మ.
వచ్చే వారం కల్లా సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసి, ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం ఇప్పటికే కొన్ని చోట్ల రాజకీయ హత్యలు జరగడం మనం చూశాం. ఇటువంటి సినిమాలు ఈ తరుణంలో మరింత ప్రమాదకరం.
దీనిపై కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి సినిమాల వల్ల తమకు రాజకీయ మైలేజ్ వస్తుందని అనుకోకుండా సంఘంలో కులఘర్షణలకు ఆస్కారమిచ్చే ఇటువంటి సినిమాలు రాకుండా చూస్తే ఆయనకే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు. అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. రాము లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుదలకు ముందు చాలా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. అయితే థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు సినిమాను ఆధరించలేదు. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.