ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా వైదొలుగుతున్న నేపథ్యంలో… ఆ అవకాశం కోసం పార్టీ సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. చివరికి రేసులో రేవంత్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు నిలిచారని సమాచారం. అయితే స్వభావ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు కలిగిన రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుంది.
ఆ విషయం పసిగట్టే రేవంత్ రెడ్డిని భూ కబ్జా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వర్గం వారు ఆరోపిస్తున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ వీరవిధేయులుగా పేరున్న శ్రీధర్బాబు కాంగ్రెస్ను వీడేందుకు సిద్దమయిపోయారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కేటీఆర్తో చర్చలు జరగ్గా… సరైన సమయం కోసం టీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చ నడుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ వేవ్ను తట్టుకొని మరీ కాంగ్రెస్ నుండి గెలిచిన శ్రీధర్ బాబు తెరాసకు ఉపయోగపడే నేత కావడం ఖాయం. ఇది ఇలా ఉండగా… కోమటిరెడ్డి బ్రదర్స్ తమలో ఎవరో ఒకరికి పీసీసీ పక్కా అని అనుకున్నారు. ఈ నిర్ణయంతో వారు కూడా నిరాశపడటం ఖాయం. ఈ పరిస్థితిలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తెలంగాణ ఏర్పడిన నాటి నుండీ తెరాసకు ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో బీజేపీ బలపడటంతో కాంగ్రెస్ లో కంగారు మొదలయ్యింది. ఉన్నఫళంగా రాష్ట్రంలో పార్టీని బలపరచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే రేవంత్ నాయకత్వంలో మిగతా సీనియర్లు పని చెయ్యగలరా అనేది అనుమానమే.