తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రె్సలో చేరిన సందర్భంగా శనివారం కర్మన్ఘాట్లో రేవంత్ మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణానికే ముప్పు ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల వార్తలు చూస్తుంటే.. సీఎం కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు అనుమానం కలుగుతోందని, ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ‘‘కేటీఆర్ను సీఎం చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రిని మెత్త పెట్టి ఒత్తిండంటే ఏదైనా జరగరానిది జరగొచ్చు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాత్రం రేవంత్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటున్నారు. తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నేతల మాటల దాడి పెంచుతున్నారు.
పైగా కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఖాళీ కానుండడంతో నేతలు మళ్ళీ యాక్టీవ్ అవుతున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు. ఈ పదవికి రేవంత్ రెడ్డి రేసులో ఉన్నారు. దీనితో ఇటువంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నారు.