revanth reddy helicopter campaignతెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ఎక్కువ మాస్ అప్పీల్ ఉన్న నాయకుడు ఎవరంటే అది కచ్చితంగా రేవంత్ రెడ్డే. సీనియారిటీ ప్రకారం చాలా మంది నాయకులు ఉన్నా రేవంత్ సాటి వాగ్ధాటి ఎవరికీ లేదనే చెప్పాలి. నేటి నుంచి డిసెంబర్ 2 వరకు 28 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఎన్నికల ప్రచారాన్ని హెలికాప్టర్ ద్వారా నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆయన ప్రచారానికి వస్తున్నందున జిల్లాల్లో ల్యాండింగ్ కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజవర్గంలో జరిగే బహిరంగ సభలో కూడా రేవంత్ పాల్గొనబోతున్నారు అంటే ఆయన రేంజ్ ఏంటో తెలుస్తుంది. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎదురీదుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ ప్రచారం అనివార్యం అయ్యింది. రేవంత్ ప్రచారానికి కావాల్సిన హెలికాప్టర్ ను కూడా ఏఐసీసీ ఏర్పాటు చేసింది.

కొడంగల్ లోని రేవంత్ నివాసంలో దీనికోసం ఓ హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హెలికాప్టర్ లను వినియోగిస్తున్నారు. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో రేవంత్ రెడ్డి కూడా తన ప్రచారానికి హెలికాప్టర్ ను వినియోగించబోతున్నాడు. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు జారబోతున్నాయి. అదే నెల 11న ఫలితాలు వెల్లడవ్వబోతున్నాయి.