4జీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ప్రకటించిన రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ను కస్టమర్ల ముందుంచింది. ఫ్రీ డేటా అండ్ రోమింగ్ అంటూ వినియోగదారులను ఎంతగానో ఆకర్షించి, ఇతర టెలికం కంపెనీల ఆగ్రహానికి గురైన జియో, ఈ సారి ఐ ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసింది. ఐ ఫోన్ యూజర్లకు ఏకంగా 15 నెలల పాటు ఉచిత సర్వీసులు అందించనున్నట్లు పేర్కొంది.
ఆపిల్ ఫోన్ ను ఉపయోగించే వారందరికీ జియో ద్వారా సంవత్సరం పాటు ఉచిత సేవలను అందిస్తున్నట్లు చెప్పింది. నెలకు 1,499 రీచార్జ్ తో లభించే సర్వీసును ఇప్పుడు పూర్తి ఉచితంగా సంవత్సరం పాటు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న వెల్ కం అనే ఆఫర్ దీనికి అదనం. దీంతో మొత్తం ఆఫర్తో కలిపి మొత్తం 15 నెలల పాటు ఉచిత సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు.
జియో వెల్ కం ఆఫర్ ఈ ఏడాది డిసెంబర్ 31న ముగిసిన అనంతరం, అన్ని ఆపిల్ కొత్త ఆవిష్కరణలు ఐ ఫోన్ 7 , ఐ ఫోన్ 7 ప్లస్ తో పాటు, ఐఫోన్ 6, 6 ప్లస్, 6S ప్లస్, ఎస్ఈ ఇతర ఐ ఫోన్ల వినియోగదారులకి కూడా ఈ ఆఫర్ అందనుంది. జియో దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్నీ విలవిలలాడుతున్నాయి. విపరీతమయిన పోటీ ఉండడంతో మిగతా కంపెనీలు కూడా ఆఫర్లను ప్రకటించే క్రమంలో నిమగ్నమై ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్ వినియోగదారులకు ఎయిర్ టెల్ సంస్థ కూడా ఓ బంపర్ బొనంజా ప్రకటించింది. తమ ఇన్ఫినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెలకు 10 జీబి 4జీ/3జీ డేటాను ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు 30 వేల వరకు ఉంటుందని ఎయిర్ టెల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 3జీ/4జీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లను ఎయిల్ టెల్ ఆఫర్ చేస్తోంది.