ప్రస్తుతం దేశంలో రిలయన్స్ ‘జియో’ సిమ్ ల ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏ ఇద్దరు కలిసినా ఈ సిమ్ కార్డుల కోసమే మాట్లాడుకుంటున్నారు. సిమ్ కార్డును దక్కించుకునేందుకు క్యూలలో గంటల కొద్దీ నిల్చుంటున్నారు. నిద్రాహారాలు మాని మరీ లైన్లలో నిలబడుతున్నారు. మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, డేటా అందుబాటులో ఉండడంతో సిమ్ను దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర నెట్వర్క్ లు కూడా తమ డేటా ప్యాక్ల ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. మరో వైపు జియో సిమ్ లకు అనూహ్య స్పందన రావడంతో కొందరు ఈ సిమ్ లను బ్లాక్ చేస్తున్నారు. ముంబైలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఈ సిమ్ కోసం యువతీ యువకుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో సిమ్ లను కొందరు కావాలనే బ్లాక్ చేస్తున్నారు.
ఒక్కో సిమ్ కార్డును ఏకంగా 500కు విక్రయిస్తుండగా అప్లికేషన్ను సైతం వంద రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే 500 మాత్రమే కాదు.. వెయ్యి రూపాయలైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మొబైల్ వినియోగదారులు చెబుతుండడం గమనార్హం. కాగా జియో సేవలు సోమవారం నుండి ప్రారంభం కానుండగా, డిసెంబరు 31వ తేదీ వరకు వినియోగదారులకు ‘ఆల్ ఫ్రీ’ సేవలు అందుబాటులో వుంటాయి.