Reliance Jio Prime Subscribers Crossed 50 Millionమార్చి 31వ తేదీతో ‘ఆల్ ఫ్రీ ఆఫర్స్’ ముగుస్తున్న వేళ రిలయన్స్ జియో మరో మైలురాయిని చేరుకుంది. జియోకు ప్రస్తుతం 10 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, ఇప్పటి వరకు 5 కోట్ల మంది వినియోగదారులు ‘ప్రైమ్’ క్లబ్‌లో చేరినట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ శుక్రవారం నాటితో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ ముగుస్తుండడంతో 99 రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్లుగా మారాలని ఇదివరకే సూచించింది.

ఈ ప్రైమ్ మెంబర్ గా తదుపరి ఏడాది పాటు ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ను పొందే వీలుంటుందని, అందుకు తగిన విధంగా 303 రూపాయలతో రీ ఛార్జ్ చేయించుకోవాలని ప్లాన్స్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం జియోకు 10-11 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వీరిలో 30 శాతం మంది కేవలం డేటా వినియోగానికి మాత్రమే జియోను తీసుకున్నట్టు అంచనా. దీంతో మిగిలిన ఏడు కోట్ల మంది వినియోగదారులను చెల్లింపు వినియోగదారులుగా మార్చుకోవాలని భావిస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 కోట్ల మంది ప్రైమ్ మెంబర్లుగా చేరడంతో, ఈ 5 కోట్ల మంది వినియోగదారులతో రిలయన్స్ జియో దేశంలో అతి పెద్ద బ్రాడ్‌ బ్యాండ్ సేవలు అందిస్తున్న సంస్థగా అవతరించనుంది. ఇప్పటి వరకు ఈ స్థానాన్ని భారతీ ఎయిర్‌టెల్ ఆక్రమించింది. గత డిసెంబరు నాటికి ఆ సంస్థకు 3.7 కోట్ల మంది వినియోగదారులున్నారు. డిసెంబరుకు మూడు నెలల ముందు ఎయిర్‌టెల్‌ కు 4.1 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, జియో రాకతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.