‘ప్రైమ్’ సభ్యత్వం ముగుస్తున్న వేళ చివరి క్షణాల్లో జియో మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రైమ్ మెంబర్ షిప్ గడువును మరో 15 రోజులు పెంచింది. అంటే ఏప్రిల్ 15 వరకు ‘ప్రైమ్’ సభ్యత్వాన్ని పొందవచ్చు. జియో తాజా ప్రకటనతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ మెంబర్షిప్ ను పొందేందుకు చివరి రోజైన మార్చి 31న వినియోగదారులు ఆన్ లైన్లో పోటెత్తడంతో, జియో వెబ్ సైట్ సర్వర్ డౌన్ కాగా, అదే పరిస్థితి జియో యాప్ కు ఎదురైంది.
సైట్ నెమ్మదిగా ఓపెన్ కావడంతో వినియోగదారులు నిరాశ చెందారు. దీంతో కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేశారు. వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జియో ఈ గడువును పొడిగించినట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రైమ్ మెంబర్షిప్ గడువును పెంచడంతో పాటు జియో మరో ‘సమ్మర్ ఆఫర్’ను కూడా ప్రకటించింది. జియో గతంలో ప్రకటించిన రీ చార్జ్ ప్లాన్లను బట్టి 303తో రీ చార్జ్ చేసుకుంటే కేవలం నెల రోజుల పాటు మాత్రమే అపరిమిత వాయిస్ కాల్స్, డేటా సేవలు లభించేవి.
కానీ ఈ ‘సమ్మర్’ ఆఫర్ లో భాగంగా సదరు మొత్తం సేవలను మూడు నెలలకు పెంచింది. అంటే ఒకసారి 303తో రీ-చార్జ్ చేసుకుంటే ఏప్రిల్, మే, జూన్ మాసాల వరకు మళ్ళీ ఉచిత సేవలు పొందవచ్చన్న మాట. ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా వినియోగదారులు ‘ప్రైమ్’ సభ్యత్వం తీసుకున్నట్టు, ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని, ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్ వర్క్ గా జియో అవతరించిందని అధికారికంగా ప్రకటించింది. తాజా బంపర్ ఆఫర్ తో జియో కస్టమర్లకు నిజంగా మరోసారి పండగ వాతావరణం నెలకొంది.