‘ఫ్రీ ఆఫర్’తో టెలికాం మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో వచ్చే నెల నుంచి టారిఫ్ ప్లాన్లను అమలులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే జియో ఉచిత ఆఫర్లు ముగియగానే వినియోగదారులు ఆ సిమ్ కార్డులను తీసి పక్కకు పెట్టేస్తారని ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అయితే బ్రోకరేజ్ కంపెనీ బెర్న్ స్టెయిన్ నిర్వహించిన ఓ రీసెర్చ్ లో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
ఈ రీసెర్చ్ లో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన యూజర్లు, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు పాల్గొన్నారు. ఈ రీసెర్చ్ ద్వారా తేలిన విషయం ఏమిటంటే… అందరూ అంచనా వేసిన విధంగా జియోను పక్కన పెట్టరని, జియో ఇస్తోన్న ఆఫర్లకే కస్టమర్లు జై కొడతారని సదరు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కేవలం 8 శాతం మంది జియో వినియోగదారులు మాత్రమే సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని చెప్పినట్లుగా తెలిపారు.
రిలయన్స్ జియో మంచి సర్వీసు, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ అందిస్తోందని, వచ్చే నెల 1 నుంచి ఆ కంపెనీ ప్రకటించినట్లుగా, నెలకు 303 రీ ఛార్జీ చేసుకుని ఆ సిమ్ నే సెకండరీ సిమ్గా వాడతామని 67 శాతం మంది యూజర్లు తెలిపారు. దీంతో ఉచిత ఆఫర్లు లేకపోయినప్పటికీ జియో వినియోగదారులు జియో వైపే ఉన్నారని రీసెర్చ్ ద్వారా స్పష్టమైంది. ఈ రీసెర్చ్ ను వెయ్యిమంది శాంపిల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ నిర్వహించింది.