Reliance Group defence project in doldrumsఅనిల్ అంబానీ సార‌థ్యంలోని అడాగ్ గ్రూప్ కోర్కెలు విని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవాక్క‌యింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో 5000 కోట్ల‌తో నౌకాద‌ళానికి అవ‌స‌ర‌మైన యుద్ధ ప‌రిక‌రాల క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ గ‌తేడాది ప్ర‌క‌టించిన అడాగ్ గ్రూప్, ఏపీ ప్ర‌భుత్వం ముందు గొంతెమ్మ కోర్కెలను ఉంచింది. తాము నిర్మించే క‌ర్మాగారానికి తొలుత వెయ్యి ఎక‌రాలు కావాలన్న అడాగ్, ఆ త‌ర్వాత దానిని రెండు వేల ఎక‌రాల‌కు పెంచింది. అది కూడా ఉచితంగా కావాలంటూ, ఏడాదికి ఎక‌రానికి రూపాయి అద్దె చొప్పున 99 ఏళ్ల‌ పాటు లీజుకు ఇవ్వాల‌ని కోరింది.

అయితే, ఇక్క‌డితో కోర్కెల చిట్టా అయిపోలేదు. తాము కోరిన‌ట్టు భూమి ఇస్తే మొద‌ట 5000 కోట్లు పెట్టుబ‌డి పెడ‌తామ‌ని పేర్కొన్న సంస్థ, అందులో 20 శాతం పెట్టుబ‌డి రాయితీ కావాల‌ని మ‌రో మెలిక పెట్టింది. అంటే 1000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వమే ఎదురు స‌మ‌ర్పించుకోవాల‌న్న మాట‌. వీటితో పాటు స్టాంప్ డ్యూటీ నుంచి అన్ని రకాల ప‌న్ను మిన‌హాయింపులు కావాల‌ని డిమాండ్ చేసింది. యూనిట్ విద్యుత్‌ను 2.50 చొప్పున 25 ఏళ్ల‌ పాటు ఇవ్వాల‌ని, 25 ఏళ్ల‌ పాటు నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది.

తాము కోరిన ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తే… రిల‌య‌న్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ పేరుతో క‌ర్మాగారం ప్రారంభించి ప్ర‌త్య‌క్షంగా మూడు వేల మందికి, ప‌రోక్షంగా ఆరు వేల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని తెలిపింది. అంతేకాదు కొత్త‌గా తీసుకునే ఉద్యోగుల‌కు శిక్ష‌ణ కాలంలో తొలి రెండు నెల‌ల జీతాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లించాల‌ని ప్ర‌తిపాద‌న‌ల్లో పేర్కొంది. రిల‌య‌న్స్ కోర్కెల చిట్టా చూసి విస్తుపోవడంతో ఏపీ స‌ర్కారు వంతు కాగా, అవాక్కవ్వడం అధికారులు వంతయ్యింది.

అయితే ప్ర‌భుత్వం మాత్రం ఇంకా ఆశావహ దృక్ప‌థంతోనే ఉంది. కంపెనీ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప‌రిశీల‌నకు ఓ క‌మిటీని నియ‌మించింది. అచ్యుతాపురం మండ‌లంలో ఎక‌రా భూమిని 17.5 ల‌క్ష‌ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు, ప్రాజెక్టు ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న ప్ర‌భుత్వం వీలైనంత హేతుబ‌ద్ధంగా ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. వ్యాట్‌, సీఎస్టీ, జీఎస్టీల‌పై ఏడేళ్ల వ‌ర‌కు 100 శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీక‌రించింది.