ఒకప్పటి పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు, గైడైన రాజు రవితేజ జనసేన పోలిట్ బ్యూరో మెంబెర్ గా కూడా ఉన్నారు. ఆయన ఉన్నట్టుంది నిన్న జనసేనాని మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ వంటి వారు సమాజానికే ప్రమాదం అని తీవ్రవ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం.
అయితే పవన్ కళ్యాణ్ ఇటీవలే మతపరమైన వ్యాఖ్యలు చెయ్యడం వల్లే వారిద్దరికీ చెడిందని తేటతెల్లం అయ్యింది. మరో వైపు జనసేన అభిమానులు రాజు రవితేజపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మతమార్పిడులను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వల్లే రాజు రవితేజ పవన్ కళ్యాణ్ పై తిరగబడ్డాడని వారు విమర్శిస్తున్నారు.
“తెలంగాణ రాష్ట్రంలోని జమ్మికుంటకు చెందిన రవితేజ్కు క్రైస్తవ మిషనరీ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రవితేజ్ తండ్రి, సోదరుడు కూడా పాస్టర్లుగా ఉన్నారు. జమ్మికుంట, జనగామ ప్రాంతాల్లో క్రైస్తవ సంస్థలకు రవితేజ్ సలహాదారుడిగా కూడా ఉన్నారు,” అంటూ రాజు రవితేజ గురించి జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. ఒకపథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ ను దెబ్బకొట్టి జనసేనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ అధికార పార్టీని గట్టిగా విమర్శించడం వల్లే అధికార పార్టీ ఇటువంటి కుయుక్తులు పన్నుతోందని వారు అంటున్నారు.