టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆదివారం రాత్రి తన కారుతో యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్కహాల్ తీసుకుని యాక్సిడెంట్ చేశాడని బాధితుడు రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, అసలు విషయం గుర్తించారు. రాజశేఖర్ నిద్రమాత్రలు మింగడంతో మత్తుకు గురై యాక్సిడెంట్ కు కారణమయ్యారని తెలుస్తోంది. రాజశేఖర్ తల్లి ఇటీవల మరణించగా, ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో రాజశేఖర్ ముభావంగా మారిపోయినట్లుగా తెలుస్తోంది.
నిజానికి రాజశేఖర్ తల్లి కర్మకాండలు సోమవారం నాడు జరగాల్సి ఉండగా, ఈ క్రమంలో ఆయన మూడీగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ‘‘చనిపోయిన తల్లి మళ్లీ రాదు. ఇలా ఎన్ని రోజులు డల్ గా ఉంటావు? పనిలో పడితే అన్నీ సర్దుకుంటాయి’’ అంటూ హితవుపలికే ప్రయత్నం చేశారు. దీంతో రాజశేఖర్ కు కోపం ముంచుకొచ్చింది. ఆ తరువాత జరిగిన స్వల్ప వాగ్వాదంతో మరింత ఆగ్రహానికి గురైన రాజశేఖర్ తన కారు (ఏపీ 13ఈ1234 నంబరు) తీసుకుని బంజారాహిల్స్ లోని తన ఇంటి నుంచి శంషాబాద్ వైపుగా వెళ్లారు.
అలా మెహిదీపట్నం వైపు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే పైనుంచి వస్తూ నిద్రమాత్రలు వేసుకున్నారు. శివరాంపల్లి పిల్లర్ నంబరు 240 వద్ద కారు ఆపి, సిగరెట్ తాగి కారును తీసిన కాసేపటికే రాంరెడ్డి కారును యాక్సిడెంట్ చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడం, వారు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడం, అందులో 20 ఎంఎల్ గా చూపించడంతో కారణాలు ఆరాతీసి రాజీకి రావడంతో వివాదం అలా ముగిసిపోయింది. ఒత్తిడిలో ఉంటూ యాక్సిడెంట్ కు గురయ్యారని జీవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఈ సందర్భంగా తేలింది.