rayalaseema-atma-gourava-sabha-visakha-garjana-amaravati-capitalఇటీవల ఉత్తరాంద్రలో విశాఖ గర్జన పేరుతో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించగా, ఈరోజు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధ్వర్యంలో ‘రాయలసీమ ఆత్మగౌరవసభ’ పేరిట బారీ ర్యాలీ నిర్వహించారు.

ఇంతకాలం ఎవరూ రాయలసీమను పట్టించుకోలేదని, మొట్టమొదటిసారిగా సిఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేద్దామని అనుకొంటే, టిడిపి, జనసేనలు అడ్డుపడుతున్నాయని, కనుక రాయలసీమ హక్కుగా దక్కిన న్యాయ రాజధానిని కాపాడుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

మూడు రాజధానులను ప్రతిపాదన చేసింది వైసీపీయే. ఏర్పాటు చేయవలసింది వైసీపీ ప్రభుత్వమే. కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా ఆ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి ఈవిదంగా రాజకీయ చదరంగం ఆడుతోంది. అసలు మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వమే ఈవిదంగా ర్యాలీలు, ధర్నాలు ఎందుకు చేయిస్తున్నట్లు?అని ప్రశ్నించుకొంటే, వికేంద్రీకరణ… అభివృద్ధి కోసం కాదు… టిడిపి, జనసేనలకు రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికే అని చెప్పవచ్చు!

రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి రాజకీయాలు చేస్తూ టిడిపి, జనసేనలను ఎక్కడికక్కడ దెబ్బతీయాడానికి, ఆయా ప్రాంతాలలో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతూ వారికి దగ్గరావడానికే అని చెప్పవచ్చు. ఈ వంకతో వైసీపీ నేతలు హడావుడి చేస్తూ తమ బలాన్ని పెంచుకోవాలనే తపన కూడా కనిపిస్తోంది.

ఈరోజు తిరుపతిలో జరిగిన ర్యాలీ భూమన కరుణాకర్ రెడ్డి, తదితర వైసీపీ నేతల బలప్రదర్శనగానే భావించవచ్చు. రాష్ట్ర ప్రజలను మూడు ప్రాంతాలుగా విభజించి ఎన్నికల వరకు వారి భావోద్వేగాలను ఇదేవిదంగా రెచ్చగొడుతుంటే, టిడిపి, జనసేన పార్టీలకు గొంతెత్తి మాట్లాడలేని పరిస్థితి కల్పించి వాటిని రాజకీయంగా బలహీనపరిచి దెబ్బతీయాలనే దురాలోచన కూడా కనబడుతోంది.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను అడుగు బయటపెట్టకుండా కట్టడి చేసి చూపుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకోగలరు?ఒకవేళ వారు అడ్డుపడుతుంటే తన నిర్ణయాన్ని అమలుచేయలేకపోవడం వైసీపీ ప్రభుత్వం చేతకానితనమే కదా?

మూడు రాజధానులని గట్టిగా మాట్లాడుతున్న వైసీపీ నేతలు రెండు రాజధానుల గురించి మాత్రమే ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహిస్తుండటం గమనిస్తే వారికి ఈ విషయంలో కూడా చిత్తశుద్దిలేదని చాటి చెప్పుకొంటున్నారు. విశాఖను రాజధానిగా వద్దనుకొనేవారిని తరిమి కొట్టాలని వాదిస్తున్నప్పుడు, అమరావతి వద్దని చెపుతున్న కృష్ణా, గుంటూరు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలను కూడా ఆ జిల్లాల ప్రజలు తరిమికొట్టాలి కదా?

అమరావతినే రాజధానిగా చేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు ఎందుకు అడిగే సాహసం చేయలేకపోతున్నారంటే పదవుల కోసమే. వారికి అమరావతిని రాజధానిగా చేయడం కంటే తమ మంత్రి పదవులు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీ టికెట్లే ముఖ్యమని భావిస్తున్నారు కనుక. అందుకే ఉత్తరాంద్రకి చెందిన వైసీపీ నేతలు అమరావతిని వల్లకాడు, ఎడారి అని ఎద్దేవా చేస్తుంటే, కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని వంటివారు తమ అధినేతను మెప్పు కోసం ‘అమరావతి భ్రమరావతి’, ‘కమ్మరావతి’ అంటూ తన ప్రాంతాన్ని తానే ఎగతాళి చేసుకొంటున్నారు.

చివరిగా ఒక మాట తప్పక చెప్పుకోవలసి ఉంటుంది. ఒకప్పుడు ఏపీ, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోతుంటే సమైక్యాంద్రా అంటూ భూటకపు ఉద్యమాలు నడిపిన వైసీపీ నేతలే, ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, సమైక్యంగా ఉన్న ఆంధ్ర ప్రజల మద్య ప్రాంతీయ చిచ్చు రగిలిస్తుండటం చాలా బాధాకరం.