జనసేన ఘోరపరాజయం తరువాత ఆ పార్టీ ఏం చెయ్యాలి అని చర్చ అంతటా ప్రారంభం అయ్యింది. అయితే ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ తో ఉన్న ఒక ఇబ్బంది గురించి చెప్పారు. బయటకు వెళ్ళిన వారు ఎన్నైనా చెప్తారు అని కొట్టిపారేయొచ్చు అయితే ఆ ఇద్దరూ బయటకు వెళ్ళేటప్పుడు పార్టీ మీద గానీ పవన్ కళ్యాణ్ మీద గానీ ఎటువంటి విమర్శలు చెయ్యలేదు. వారిలో ఒకరు ఎన్నికల ముందు వెళ్లిపోయిన మాజీ సమాచార కమీషనర్ విజయబాబు, రెండు రోజుల క్రితం వీడిన రావెల కిషోర్ బాబు.
పవన్ కళ్యాణ్ పార్టీలోని మిగతా వారితో మాట్లాడారని, అన్ని నాకే తెలుసు నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టు ప్రవర్తిస్తారని విజయబాబు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. నిన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ అప్పాయింట్మెంట్ దొరికేది కాదని, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడేవారు కాదని, రాజకీయ వ్యూహాలపై చర్చలలో ఎన్నడూ తనకు అవకాశం ఇవ్వలేదని రావెల ఆరోపించారు.
ఈ ఆరోపణలు నిజమో కాదో మనకు తెలియదు అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ నిజమే అయితే పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉన్న కోట గోడలు బద్దలుగొట్టాల్సిందే. ఎన్నికల ముందు ఇటువంటి ప్రవర్తన చెల్లుబాటు అయితే అయ్యిఉండవొచ్చు గాక ఓటమి తరువాత మాత్రం దాని వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. దానిని పవన్ కళ్యాణ్ ఎంత గమ్మున తెలుసుకుంటే అంత మంచిది. విజయబాబు, రావెల కిషోర్ బాబు ఇద్దరూ జనసేనను వీడి బీజేపీలో చేరడం విశేషం.