మాజీ మంత్రి, ఏపీ బిజెపి ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు ఇవాళ్ళ హటాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుకి పంపించారు. బిజెపిలో తనకు సముచిత గౌరవం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొని వ్యక్తిగత, కుటుంబ కారణాల చేత పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నందుకు అన్యధా భావించవద్దని రావెల తన రాజీనామా లేఖలో కోరారు.
రావెల చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో 2017వరకు మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జనసేనకు గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరారు. మళ్ళీ ఇప్పుడు దానికీ గుడ్ బై చెప్పేసారు.
రాష్ట్రంలో టిడిపి మళ్ళీ బలం పుంజుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతుండటంతో వచ్చే ఎన్నికలలో టిడిపికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించి మళ్ళీ పార్టీ గూటికి చేరుకోవాలనుకొంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఆయనకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే, ఆయన పార్టీని వీడి వెళ్ళిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడును, టిడిపిని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేసినందున, టిడిపి శ్రేణులు ఆయన రాకకు సుముఖంగా లేవని తెలుస్తోంది. మరి ఆయన టిడిపిలో చేరేందుకే బిజెపికి రాజీనామా చేసి బయటకు వచ్చారా లేక నిజంగానే వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే రాజీనామా చేశారా? అనేది త్వరలోనే ఆయన కార్యాచరణతో తేలిపోతుంది.