‘ఛలో, గీత గోవిందం’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ సందడి చేస్తోన్న నాగ్ – నానిల మల్టీస్టారర్ “దేవదాస్”తో హంగామా చేస్తోన్న హీరోయిన్ రష్మిక ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఇటీవల బ్రేకప్ అయిన నిశ్చితార్ధాన్ని కూడా ప్రస్తావించింది.
‘వయసులో ఉన్నపుడు మనకు అన్నీ మంచిగానే ఉంటాయని, కానీ ఏది మంచో, ఏది చెడో చెప్పగలిగేది తల్లితండ్రులేనని’ అన్న రష్మిక, ‘ఓ బంధంలో పొరపాట్లు, లోటుపాట్లు కనిపిస్తే అక్కడితో వదిలేయడం మంచిదని, లేదంటే భవిష్యత్తులో చాలా కోల్పోవలసి ఉంటుందని’ తన బ్రేకప్ అయిన విషయంపై మొదటిసారిగా స్పందించింది.
‘గీత గోవిందం’ సెట్స్ లో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్తూ…. ఓ రోజు షూటింగ్ కు ఆలస్యంగా వెళ్తే, ఎవరూ తనతో మాట్లాడలేదని, దీంతో ఓ పక్కన కూర్చుని ఏదుస్తుండగా దర్శకుడు పరశురామ్ వచ్చి, ‘మేమంతా కావాలనే ఇలా చేసామని, కావాలంటే కెమెరా చూడు’ అంటూ కెమెరా వంక చూపించారని, అలా ఆటపట్టించారంటూ సరదా సంఘటనను పేర్కొంది.
కెమెరా తన వెనుకే ఉందన్న విషయం దర్శకుడు చెప్పేవరకు తాను గమనించలేకపోయానని చెప్పిన రష్మిక, తాను అల్లరిపిల్లలా కనిపించినా, సెన్సిటివ్ స్వభావం ఎక్కువని, ఎవరైనా తనతో నవ్వుతూ మాట్లాడకపోతే ఇబ్బంది పడిపోతానంటూ చలాకీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ కెరీర్ లో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆశిద్దాం.