ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 175 ఓట్లకు గాను ఇప్పటి వరకు 167 ఓట్లు పోలైయ్యాయి. ఓటింగ్ కు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అరెస్ట్ కారణంగా అచ్చెన్న అనారోగ్య కారణంగా అనగాని ఓటింగుకు దూరంగా ఉన్నారు. సాయంత్రం గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇది ఇలా ఉండగా… ఈ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతుగా క్రాస్ వోటింగ్ జరిగింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో ఓటింగుకు హాజరైన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేశారు. ఈ క్రమంలో పార్టీ విప్ ని కూడా ధిక్కరించారు. అయితే మరో రెబెల్ ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటివరకూ ఓటింగుకు రాలేదు.
అదే సమయంలో జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటింగుకు హాజరయ్యి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేశారు. అయితే రాజ్యసభ ఎన్నికలకు గానూ జనసేన పార్టీ ఆయనకు ఎటువంటి విప్ జారీ చెయ్యలేదని సమాచారం. దీనితో ఆయనకు ఏ విధంగానూ ఇబ్బంది ఉండదు.
ఎన్నికల బరిలో అధికార పార్టీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు బరిలో ఉన్నారు. ఇక సభలో సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది.