కొన్ని సినిమాల ట్రైలర్లు చూడగానే… కామెడీ కోసం తీసారో లేక వారు తీసినవి కామెడీగా కనపడుతున్నాయో అన్న సందేహం రాక మానదు. అలాంటి కోవలోనే “రన్వీర్ చింగ్ రిటర్న్స్” సినిమా ట్రైలర్ నిలుస్తోంది. రన్వీర్ సింగ్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ పై వీక్షకులలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హాలీవుడ్ ‘మ్యాడ్ మాక్స్’ తరహాలో కనపడుతున్న ఈ సినిమా నేపధ్యం ‘ప్రపంచంలో అంతరించిపోతున్న ఆహారం’ చుట్టూ తిరుగుతుంది.
ఆహారాన్ని సంరక్షించడానికి ఒకే ఒక్క రాజు రన్వీర్ చింగ్ ఉంటాడు… అతను ప్రజలను ఎలా కాపాడాడు అన్నదే చిత్ర కధాంశంగా తెలుస్తోంది. రన్వీర్ కు జంటగా తమన్నా కనువిందు చేయనుండగా, సినిమా కధకు మూలమైన గ్రాఫిక్స్ ఆశించిన రీతిలో లేకపోవడం సినీ ప్రియులకు నిరాశ కలిగిస్తోంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, కామెడీ తరహాగా అనిపించడం మరో మైనస్.
ఈ నెల 19వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. వరుసగా విభిన్న పాత్రలు చేస్తున్న రన్వీర్ సింగ్ కు గత చిత్రం ‘బాజీరావు మస్తానీ’తో స్టార్ స్టేటస్ లభించినట్లయ్యింది. దీంతో ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా రన్వీర్ నిలవబోతున్నాడు. ‘బాహుబలి’తో ఉత్తరాదిని కూడా ఊపేసిన తమన్నాకు బాలీవుడ్ లో జెండా పాతడానికి ఇదొక మంచి అవకాశం. మరి ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే ముందుగా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి..!