This-Is-the-Overlooked-Threat-for-Rangasthalamటాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించిన “రంగస్థలం” సినిమా పోస్టర్స్ పై గ్రాస్ కలెక్షన్స్ ను పేర్కొన్న వైనం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘భరత్ అనే నేను’ సినిమా కలెక్షన్స్ తో పోలుస్తూ నెట్టింట పెద్ద చర్చకు దారి తీసిన ఈ పోస్టర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

బాక్సాఫీస్ నెంబర్స్ ను చూసే విధానంలో ఆడియన్స్ నుండి తనకు ఆరోగ్యకరమైన అనుభూతి కలుగలేదు. దీంతో తాను ఒక నిర్ణయం తీసుకున్నానని… భవిష్యత్తులో తన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ పై ఇక నుండి కలెక్షన్స్ ఉండవని, నిజానికి ఎంత ఎక్కువ మంది సినిమాను చూసారు అన్నదే ముఖ్యమని, కలెక్షన్స్ కాదని మెగా పవర్ స్టార్ అభిప్రాయపడ్డారు.

ఇది చాలా ఆహ్వనించదగ్గ పరిణామం. ఒక్క రామ్ చరణ్ మాత్రమే కాదు, ఇతర స్టార్ హీరోలు కూడా ఇదే వైఖరిని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘రంగస్థలం’ తర్వాత హిట్ జాబితాలో ఉన్న ‘భరత్ అనే నేను’ కూడా ఇదే రకమైన ‘పోస్టర్స్ – కలెక్షన్స్’ పబ్లిసిటీ చేయగా, అది కూడా వివాదాస్పదమైంది. ఇక నుండైనా ఈ కలెక్షన్స్ గోలలకు శుభంకార్డు వేయాల్సిన అవసరం ఉంది.