Ramanjaneyulu Pulaparthi Bhimavaram TDP MLAఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా విజయవాడ పశ్చిమ నియోజక వర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సోషల్ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన ఈ ఎమ్మెల్యే “బికాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందంటూ” వాదించిన విధానంతో ఒక్కసారిగా హైలైట్ అయిన జలీల్ ఖాన్, ఆ తర్వాత దానిని సరిదిద్దుకుంటూ ఓ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే తాజాగా మరో తెలుగుదేశం ఎమ్మెల్యే సోషల్ మీడియాకు కావల్సినంత ఆహారాన్ని ఇస్తున్నాడు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే… 20 సంవత్సరాల పాటు తను ఆహారం తీసుకోలేదన్న విషయమే, సోషల్ మీడియాకు అసలు ఆహారంగా మారింది. “తాను పుట్టిన నాటి నుండి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు అన్నం తినడం తనకు తెలియదని, కేవలం పాలు మాత్రమే తిరిగి పెరిగానని, ఆ తర్వాత తినడానికి కారణం కూడా పెళ్లి ప్రతిపాదనలేనని, అన్నం తినకపోతే పెళ్లి కాదన్న భావనతో భోజనం చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ మధ్యాహ్నం మాత్రమే తానూ భోజనం చేస్తానని, రాత్రికి పాలు మాత్రమే తాగుతానని” భీమవరం నియోజకవర్గపు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన పలుపర్తి రామాంజనేయులు చెప్పిన సంగతులు నెట్టింట సందడి చేస్తున్నాయి.

జలీల్ ఖాన్ ఉదంతం తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఈ ‘భీమవరం ఎమ్మెల్యే’ సంగతులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇరవై ఏళ్ళ పాటు అన్నం తినని ఈ ఎమ్మెల్యే ఏ గ్రహం నుండి వచ్చారో అంటూ పడుతున్న సెటైర్లకు, కౌంటర్లకు కొదవలేదు. అయితే ఊహ వచ్చిన తర్వాత తినడం, తినకపోవడం అన్నది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, పసితనంలో ఏమి తెలియని వయసులో పెద్దలు ఖచ్చితంగా ఆహారం పెడతారు కదా! మరి అప్పుడు ఎలా వద్దన్నారో ఈ ఎమ్మెల్యే గారు… బహుశా పువ్వు పుట్టగానే పరిమళించడం… అంటే ఇదేనేమో అంటూ వేస్తున్న ఛలోక్తులకు కొదవలేదు.