టీడీపీ హయాంలో లేని పింక్ డైమండ్ పోయింది అంటూ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన రమణ దీక్షితులకు ఇటీవలే మళ్ళీ టీటీడీలో ప్రధాన అర్చకుడి పదవి ఇచ్చారు సీఎం జగన్. సరిగ్గా తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ఈ నియామకం జరగడం యాదృచ్చికం ఏమీ కాదు. అందుకు తగ్గట్టే రమణదీక్షితులు కూడా స్వామి భక్తి చాటుకుంటున్నారు.
ఏదో వంకతో రోజు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రతి పాలకుడిలో కూడా విష్ణు అంశ ఉంటుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్కు సూచించారు. సనాతన దర్మానికి ఆటంకం కలిగినప్పుడు జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని పునరుద్ధరించారని కొనియాడారు.
అంతటితో ఆగకుండా… చెట్టుకు పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదనీ.. వైఎస్ఆర్ హయాంలో కూడా కొందరు ఇలానే దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. చూడబోతే రమణ దీక్షితులు తిరుపతి ఉపఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్నట్టుంది అని విమర్శలు వస్తున్నాయి.
“చంద్రబాబు హయాంలో దేవుడిని అడ్డం పట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల రాజకీయం చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ గానే భజన చేస్తున్నారు. మీడియా ముందు ఏలిన వారిని పొగడ్తలతో ముంచెత్తి అదే నోటితో గుడిలోకి వెళ్లి స్వామివారి కైంకర్యాలు చెయ్యడం దారుణం,” అంటూ పలువురు బాధపడుతున్నారు.