జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలను టార్గెట్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో చెలరేగిపోయారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులతో చేతులు కలపడం ద్వారా పవన్ కల్యాణ్ మరో ఘనతను సాధించారని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో గొప్ప ఆత్మస్థైర్యంతో అన్ని నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయాలని… లేకపోతే ఆయన సోదరుడు చిరంజీవి కన్నా పెద్ద తప్పు చేసినవాడవుతారని తెలిపారు. హైదరాబాద్ నొవోటెల్ లో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ కల్యాణ్ ఓ సింహంలా కనిపించారని, ఆయన మాటలు సింహ ఘర్జనను తలపించాయని ఓ రేంజ్ లో వేసుకున్నారు.
వివిధ సెక్షన్లకు సంబంధించిన వ్యక్తులను ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని అడుక్కోవడం ద్వారా పవన్ కూడా చిరంజీవిలా మారిపోతున్నారని విమర్శించారు. చిరంజీవిలా పవన్ కల్యాణ్ మారిపోక ముందే ఏపీ ప్రజలు మేల్కొనాలని… లేకపోతే ప్రజారాజ్యం కన్నా దారుణంగా జనసేన తయారవుతుందని మెగా ఫ్యాన్స్ కు మంటెక్కించే ట్వీట్స్ చేశారు.