సాధారణ విషయాలనే సంచలనం చేసే రాంగోపాల్ వర్మ, సంచలనమైన విషయాలను ఎందుకు విడిచిపెడతారు. అవును… ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన తమిళనాడు జల్లికట్టుపై వర్మ తనదైన శైలిలో చెలరేగిపోయారు. “సినిమాల్లో కాకులు, కుక్కలను చూపించడం కూడా నేరమని… అలాంటిది సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని” వర్మ ప్రశ్నించారు.
జల్లికట్టు సమయంలో ఆ ఎద్దుల కొమ్ములు, చెవులు, తోక విరిగిపోతాయని… ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణిస్తాయని… ఇది అనాగరికమని అన్నారు. అమాయక జీవులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అనే ముసుగు వేయడం దారుణమని తెలిపారు. అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే… అమాయక ప్రజలను హింసించే ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా కూడా కరెక్టేనని చెప్పారు.
జల్లికట్టును కోరుతున్న ఒక్కొక్కరిపై 100 ఎద్దులను వదలాలని… అప్పుడు కానీ ఎద్దులు పడుతున్న బాధ ఏంటో వారికి అర్థం కాదని వర్మ అన్నారు. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారంతా జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నారని, జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలవదని ఎద్దేవా చేశారు. జంతువులకు ఓటు హక్కు ఉంటే… ఏ రాజకీయ నేత అయినా జల్లికట్టుకు మద్దతు తెలిపేవాడా అని ప్రశ్నించారు. జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్నవారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers pic.twitter.com/0f9fx8dEsN
— M9News (@M9News) January 18, 2017