Ram-Gopal-Varma-RGV satire on Akun sabharwal drugs case invetigationడ్రగ్స్ పై సిట్ దర్యాప్తు గురించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయానని, అయితే ఈ విషయంలో తెలుగు మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డాడు. డ్రగ్స్ పై దర్యాప్తు చేస్తున్న అకున్ సబర్వాల్ ను తెలుగు మీడియా ‘బాహుబలి’లోని ‘అమరేంద్ర బాహుబలి’ లెవెల్ లో పొగిడేస్తోందని అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై రాజమౌళి ‘బాహుబలి 3’ సినిమా తీయాలేమో అని ఎద్దేవా చేశాడు. డ్రగ్స్ లో వినియోగంలో చాలా మంది ఉన్నారని, అయితే సినీ పరిశ్రమను మాత్రమే మీడియా ఫోకస్ చేస్తోందని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ వివరాలు బయటకు తెలియకుండా, సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. కొంత మంది (రాంగోపాల్ వర్మ) చిన్న పిల్లలను కూడా 12 గంటల పాటు విచారిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా తాము కేసును దర్యాప్తు చేస్తున్నామని, పిల్లలు డ్రగ్స్ ను ఇతరులకు అలవాటు చేస్తారా? మజా పేరుతో స్నేహితులను ఉచ్చులోకి లాగుతారా? డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుందో పిల్లలకు తెలుస్తుందా? అంటూ నిలదీశారు.

ఎవరిని ఎలా విచారించాలో వారిని అలాగే విచారిస్తామని, ఎవరికీ సర్టిఫికేట్లు మంజూరు చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పని తాము చేస్తున్నామని, తమ పని తీరును ఎద్దేవా చేయడం సరైన విధానం కాదని సూచించారు. విచారణకు వచ్చిన వారందరూ సహకరిస్తున్నారని, బాధితులకు, నిందితులకు తమ విచారణ విధానం అర్థమవుతుందని అన్నారు.

సినీ పరిశ్రమను తాము లక్ష్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఈ కేసును నీరుగార్చే ఉద్దేశ్యం తమకు లేదని, సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైందని, చట్ట ప్రకారం తాము నడుచుకుంటున్నామని తెలిపారు. పిల్లలు డ్రగ్స్ కు బానిసలు కాకూడదనే ప్రభుత్వ ఆదేశాలతో తొలుత లోతుగా దర్యాప్తు ప్రారంభించామని, ఆ తరువాత సాఫ్ట్ వేర్ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ఇలా కొనసాగుతూ చిట్టచివరన సినీ పరిశ్రమ వద్దకు వచ్చామని తెలిపారు. అంతే తప్ప, సెన్సేషన్ కోసం సినీ పరిశ్రమను తాము లక్ష్యం చేసుకోలేదని స్పష్టత ఇచ్చారు.