Ram Gopal Varma not doing Mega Family movieనిన్న రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ప్రకటన చేశారు. తన తదుపరి చిత్రం మెగా ఫ్యామిలీ అని దాని వివరాలు రేపు పొద్దున్న ప్రకటిస్తా అని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి వివాదాస్పద చిత్రాలు తీస్తున్న ఆర్జీవీ మెగా ఫ్యామిలీ మీద సినిమా అంటే మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు.

అయితే తెల్లారిందే వారికి ఉపశమనం కలిగించాడు రాము. అదంతా తూచ్ అంటూ అలాంటీ సినిమా ఏమి తీయట్లేదని స్పష్టం చేశాడు వర్మ. కాకపోతే 39 మంది పిల్లలు ఉన్న ఒక మనిషి కథ ఇదని కాకపోతే అంత మంది పిల్లల మీద తాను సినిమా తీయలేను కాబట్టి దాని జోలికి వెళ్లడం లేదు అంటూ ఒక చురక అంటించాడు.

అయితే సినిమా తప్పింది కదా అని ఊపిరి పీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇప్పటికే వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ లో రాము చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను తీవ్ర అభ్యంతరకరంగా చూపించారని, కులాల మధ్య కుంపట్లు రాజేసే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ సినిమా మీద, దర్శకుడి మీద లీగల్ గా వెళ్లాలని పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అధికారంలో ఇటువంటి చీప్ ప్రయత్నాలను ఉపేక్షించి నష్టపోయాం అని, ఇప్పుడు కూడా ఉపేక్షిస్తే మరింత నష్టమని వారు చంద్రబాబు, లోకేష్ల మీద ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.