కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికైతే ఆయన మరింత సుపరిచితుడే. తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ.. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏకంగా సినీ పెద్దలను టార్గెట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
కృష్ణంరాజు మృతిని టార్గెట్ చేసుకుని వర్మ ఈసారి టార్గెట్ చేశారు. సీనియర్ నటుడు, నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి తన వంతు సపోర్ట్ చేసిన సీనియర్ దిగ్గజం చనిపోతే సినీ ఇండస్ట్రీ ఇచ్చే నివాళి ఇదేనా అని వర్మ ఎద్దేవా చేశారు. పరుష పదజాలంతో కామెంట్స్ చేశారు. ‘‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!’’ అంటూ తొలి ట్వీట్ చేసిన ఆర్జీవీ తెలుగు సినీ ఇండస్ట్రీ అత్యంత సెల్ఫిష్ ఇండస్ట్రీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రెండో ట్వీట్లో సినీ పెద్దలను టార్గెట్ చేస్తూ ‘‘కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహన్ బాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది’’ అంటూ రేపు మీకు కూడా పరిస్థితి కూడా ఇంతే అని శాపనార్థాలు పెట్టారు. సినీ పరిశ్రమపై ఆధారపడే వారే దానిపై ఉమ్ముకున్నట్లు అవుతుందన్నారు వర్మ.
‘‘మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది ’’ అని ఈ ట్వీట్లో మనసు కంటే చావుకి విలువ ఇవ్వాలంటూ.. డబ్బులు కోసం షూటింగ్స్ ఆపేసిన ఇండస్ట్రీ కృష్ణంరాజు కోసం రెండు రోజులు షూటింగ్స్ ఆపలేవా! అంటూ ఇండస్ట్రీలోని పెద్దలు, నిర్మాతలకు చురకలు అంటించారు.
నిజానికి రామ్ గోపాల్ వర్మ తీరు డిఫరెంట్గా ఉంటుంది. సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇంకా డీప్గా చెప్పాలంటే.. ఎవరెలా పోయినా సినిమా ఆగ కూడదనేది తన ఆలోచనగా అనిపిస్తుంది. కానీ.. కృష్ణంరాజు విషయంలో మాత్రం ఆయన ఐడియాలజీ మారిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన ట్వీట్స్ను గమనిస్తే అది క్లియర్గా తెలిసిపోతుంది. ప్రతి ట్వీట్లోనూ సినీ పెద్దలమని చెప్పుకునే వారు ప్రవర్తించే తీరుని ఆయన ఎండగట్టారు. రీసెంట్గా ఖర్చు ఎక్కువ అయిపోతుందంటూ షూటింగ్స్ ఆపుకున్నప్పుడు లేని బాధ, కృష్ణంరాజువంటి లెజెండ్రీ నటుడు చనిపోతే మాత్రం ఎందుకు చేయటం లేదంటూ ప్రశ్నించారు. ఓ రకంగా ఆర్జీవీ వేసిన ప్రశ్న సరైందే.
సినీ ఇండస్ట్రీకి అండగా నిలబడిని దిగ్గజ నటుడు మరణిస్తే.. ఇండస్ట్రీ చేసే నివాళి ఇది కాదు కదా అని వర్మ అర్థం. సినీ ఇండస్ట్రీకి డైరెక్ట్గానో, ఇన్డైరెక్ట్గానో ఎంతో సేవ చేసిన కృష్ణంరాజు చనిపోతే సంతాపాన్ని ప్రకటిస్తూ కనీసం తెలుగు రాష్ట్రాల్లో జరిగే షూటింగ్స్ను రెండు రోజులు ఆపితే కాస్త ఘనమైన నివాళిగా అనిపించేది. కానీ సిట్యువేషన్ అలా కనిపించటం లేదు. ఆర్జీవీ మాటలు, ట్వీట్స్ను ఎవరూ పట్టించుకునే స్థితిలో అయితే లేరనే చెప్పాలి. ఎందుకంటే ఆర్జీవీ ఆదివారం ట్వీట్ చేస్తే.. సోమవారం రోజున చిరంజీవి ఓ వైపు.. మహేష్ మరో వైపు తమ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు.. అది పరిస్థితి.