మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాకు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిరుకున్న విశేషమైన అనుభవానికి, చెర్రీ నిర్మాత అనడం కంటే… టైటిల్ కార్డ్స్ లో నిర్మాతగా పేరు వేయించుకోవడానికే అన్న టాక్ ఉంది. కానీ, చెర్రీ మాత్రం ఓ పక్కన తన ‘ధ్రువ’ సినిమా సెట్స్ లో పాల్గొంటూనే, మరో పక్కన తను నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్స్ కు కూడా వెళ్తుండడం విశేషం.
తాజాగా రామ్ చరణ్ సెట్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను చిత్ర ప్రొడక్షన్ సంస్థ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కళా దర్శకుడు తోట తరణితో చెర్రీ ముచ్చట్లు చెప్తున్న ఫోటోలు మెగా అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. సింపుల్ లుక్ లో ఉన్న మెగా వారసుడు లెజెండరీ తోట తరణితో ఏం చెప్తున్నారో గానీ… చిరు నవ్వులు చిందిస్తున్న రామ్ చరణ్ ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రత్నవేలు, తోటతరణి వంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ‘చందమామ’ కాజల్ కనువిందు చేయబోతోంది. ఆగష్టు 22వ తేదీన చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులను అలరించేందుకు ఫస్ట్ పోస్టర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.