జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలను చూసి స్ఫూర్తి పొందారట అబ్బాయి రామ్ చరణ్. ఇటీవల పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలోని గోవులతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్మీడియా వేదికగా విడుదల చేశారు. తాను కూడా భవిష్యత్తులో గోశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రామ్ చరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఫోటోలు పశుప్రేమికులను మరీ ముఖ్యంగా గోసంరక్షకులను ఆనందంలో ముంచెత్తాయి. పవన్ కళ్యాణ్ మరింత మందిని గోవుల సంరక్షణకు ప్రేరేపిస్తారని వారు అంటున్నారు. కొందరు బీజేపీ అభిమానులేమో ఇది పవన్ కళ్యాణ్ గర్ వాపసీకి సంకేతం అంటూ పిచ్చి ఉపమానాలు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ సినిమాలలోకి వస్తారంటూ వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియడ్ సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ చిత్రాలను ఆయన ఒకే చేశారంటూ వార్తలు వినవస్తున్నాయి. క్రిష్ సినిమా వచ్చే నెల 15న ముహూర్తం జరుపుకుంటుందని కూడా అంటున్నారు.
ఇక రాజకీయాల విషయానికి వస్తే… నవంబర్ 3న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా జనసేన పార్టీ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చెయ్యనున్న విషయం తెలిసిందే. దీనికి మద్దతు ఇవ్వమని పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడుకు, కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసినట్టు సమాచారం. చంద్రబాబు సంఘీభావం ప్రకటించగా, బీజేపీ సొంతంగానే ఈ సమస్య మీద పోరాడాలని నిర్ణయించుకుందట.