మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సంక్రాంతి సినిమా ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా ద్వారా మీ అంచనాలను అందుకోలేకపోయామన్నారు. చిత్ర నిర్మాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ “మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం,” అన్నారు చరణ్.
దీంట్లో నిర్మాత డీవీవీ దానయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి, దర్శకుడు బోయపాటి గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. కేవలం సినిమాకు పని చేసిన వారందరికీ థాంక్స్ అని సరిపెట్టారు. దీనితో బోయపాటిని ఇరుకున పెట్టినట్టు అయ్యింది. అయితే అంతటితో ఆగలేదు. ఈ రోజు కొన్ని వెబ్ సైట్లలో రామ్ చరణ్ టీమ్ కొన్ని ఉద్దేశపూర్వక లీకులు ఇచ్చారు. చిత్రం వల్ల నష్టపోయిన వారికి చరణ్ ఐదు కోట్లు వెనక్కు ఇవ్వబోతున్నాడని, దానయ్య కూడా ఐదు కోట్లు ఇవ్వడానికి కమిట్ అయ్యాడని తెలిపారు.
మరో ఐదు కోట్లు బోయపాటిని ఇవ్వమని అడిగితే దానికి ఆయన ఒప్పుకోలేదట. దానయ్యకూ ఆయనకూ మాటామాటా పెరిగి బూతులు తిట్టుకున్నారని, పక్కన ఉన్న వారు ఆపకపోతే కొట్టుకునే వారని ఆ కథనం సారాంశం. 90 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన వినయ విధేయ రామ కేవలం 63 కోట్లు మాత్రమే సంపాదించింది. దీనితో దాదాపుగా 30% లాస్ మూటగట్టుకుంది. సంక్రాంతి సమయంలో రిలీజ్ కాకుండా ఉండుంటే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండేది. నష్టం సంగతి అటుంచితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల రామ్ చరణ్ కు చాలా చెడ్డ పేరు వచ్చింది.
దీనిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రంగస్థలం వంటి భారీ హిట్ తరువాత ఇటువంటి అనుభవం కావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బోయపాటిని అన్ని రకాలుగానూ బద్నామ్ చెయ్యాలని, ప్రేక్షకుల ముందు ఆయనను విలన్ గా చూపెట్టడం ఈ లీక్ ఉద్దేశమని నమ్మకమైన వర్గాల సమాచారం. బహుశా తన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడని రామ్ చరణ్ కు బోయపాటి అంటే కోపం కావొచ్చు. బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో బిజీ. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.