మేగజీన్ల కవర్ పేజీల కోసం హీరోయిన్లు ఫోటోషూట్ చేయడం చాలా సాధారణ విషయమేనని టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది. ఇటీవల ఇచ్చిన ఓ మ్యాగ్ జైన్ పై రకుల్ అందాల విందు హాట్ టాపిక్ కావడంతో, తాజాగా దీనిపై వివరణ ఇచ్చుకుంది. అలాంటి ఫోటోషూట్ తానొక్కదాన్నే చేయలేదని… అందరు హీరోయిన్లు రెగ్యులర్ గా చేస్తున్నదేనని తెలిపింది.
ప్రముఖ మేగజీన్ కవర్ పేజీలపై మెరవాలనే కోరిక తనకు కూడా ఉందని… ఇలాంటి ఫోటోషూట్లలో పాల్గొన్నందుకు తనకు కానీ, తన కుటుంబానికి కానీ లేని ఇబ్బంది… మిగతావారికి ఎందుకని అసహనం వ్యక్తం చేసింది. ఫోటోలు నచ్చితే నచ్చాయని చెప్పాలని… లేకపోతే సైలెంట్ గా ఉండాలి గానీ, తనపై అసభ్యంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసింది.
మితిమీరి గ్లామర్ ను ప్రదర్శించడానికి తాను కూడా వ్యతిరేకమేనని… తన హద్దులను తాను ఎన్నడూ దాటబోనని చెప్పింది. అలాగే దక్షిణాదిలో తనకు సినీ ఆఫర్లు తగ్గిపోయాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించింది. ఆ వార్తలతో తాను ఏకీభవించబోనని, గతంలో సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమేనని చెప్పింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని, ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపింది.
మొహమాటం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని చేయాల్సి వస్తుందని… అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయని చెప్పింది. తన సినిమాలు కొన్ని పరాజయం కావడానికి పైవన్నీ కారణాలే అని తెలిపింది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని, బాలీవుడ్ లో విడుదలైన తన చిత్రం ‘అయ్యారీ’ నిరాశపరిచినప్పటికీ… తన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని, త్వరలోనే తెలుగులో ఒకటి, తమిళంలో మరొక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించింది.