చెన్నైలో జరిగిన “స్పైడర్” ఆడియో వేడుక ప్రిన్స్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. మొదటి రెండు పాటల కంటే చివరి రెండు పాటలు శ్రోతలను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించడం, అలాగే విజువల్ గా పాటలన్నీ అద్భుతంగా ఉండడంతో… ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆ మాటకొస్తే ఒక్క మహేష్ అభిమానుల్లో కాదు, చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ‘స్పైడర్’ పాటలకు స్టెప్పులు వేయకుండా ఉండలేకపోయింది.
ఆడియో వేడుకపై రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన సమయంలో ‘సిస్లియా…’ వీడియో సాంగ్ స్క్రీన్ మీద ప్రత్యక్షం కాగా, ఈ పాట ప్రదర్శితమవుతున్న సమయంలో ఓ అభిమాని స్టేజ్ పైకి వచ్చేయగా, సదరు అభిమానితో రకుల్ ప్రీత్ కూడా కాలు కదిపి డ్యాన్స్ లు వేసింది. సినిమాలో వేసిన స్టెప్పులను సదరు అభిమానితో రకుల్ ప్రీత్ సింగ్ పంచుకోవడం చూసి ఆశ్చర్యపోవడం ఆడిటోరియంలో ఉన్న వారి వంతయ్యింది.
సాధారణంగా ఫ్యాన్స్ దగ్గరకు చేరువ అవుతుంటే, హీరోయిన్లు పది అడుగులు వెనక్కి వేస్తుంటారు. కానీ రకుల్ మాత్రం ఎలాంటి బెరుకును ప్రదర్శించకుండా, ఆ అభిమానితో కలిసి స్టెప్పులు వేసి, ‘స్పైడర్’ వేడుకను మరింత స్పెషల్ గా మార్చేసింది. బహుశా సదరు అభిమాని కూడా రకుల్ తనతో పాటు డ్యాన్స్ వేస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. మొత్తానికి ‘స్పైడర్’ వేడుక సదరు అభిమానికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.