సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం, అన్నాతే… సిరుతై ఫేమ్ శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా దసరా స్పెషల్ గా విడుదల కావాల్సి ఉంది, కాని కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పుడు సమ్మర్ 2021 కు వాయిదా వెయ్యబడిందని చెన్నై ట్రేడ్ సర్కిల్స్ వర్గాలు తెలిపాయి.
సూపర్ స్టార్ వయస్సును బట్టి, కనీసం మరో ఆరు నెలల వరకు షూట్ను తిరిగి ప్రారంభించడం సురక్షితం కాదని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు 69 ఏళ్ల సూపర్ స్టార్ కూడా అంగీకరించారు. కాబట్టి, ఆలస్యం తప్పనిసరైందని అంటున్నారు. నిజానికి ఇంకో షెడ్యూల్ పూర్తి చేస్తే సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.
సమ్మర్ రిలీజ్ అంటే ఆ లోగా పరిస్థితులు చక్కబడి తెలుగులో కూడా ఒకేసారి సినిమా విడుదల చెయ్యడం తేలిక అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అన్నాతేను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మరియు ఖుస్బు సుందర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.
ఈ చిత్ర దర్శకుడు శివ గతంలో తెలుగులో మాస్ మహారాజా రవితేజతో కలిసి దరువు అనే ఫ్లాప్ చిత్రం దర్శకత్వం వహించాడు. తమిళ సూపర్ స్టార్ అజిత్ తో కొన్ని ఆకట్టుకునే హిట్స్ ఇచ్చాడు. దానితో ఆయనకు రజినీకాంత్ అవకాశం ఇచ్చారు. రజినీకాంత్ కు చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమా మీద ఆయన ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.