Rajinikanth Steps Back for a Whileమొన్న ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాల నుండి విరమించుకుంటారని ఒక వార్త తమిళనాడులో చక్కర్లు కొట్టింది. అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న మాట వాస్తవమే అని, అయితే రాజకీయాల పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అభిమానులతో చర్చించాకే తన నిర్ణయం ప్రకటిస్తా అని రజినీ చెప్పారు.

అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. రజినీకాంత్ తో ఆరెస్సెస్ సిద్ధాంత కర్త, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి భేటీ అయ్యారు. వారిద్దరూ దాదాపు గంటన్నర పాటు భేటీఅయ్యారు. రజినీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బీజేపీకే మద్దతు ఇవ్వనున్నారు అంటూ ఊహాగానాలు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

గతంలో అనేక పర్యాయాలు రజినీకాంత్ మోడీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. ఈ మధ్య కాలంలో బీజేపీ దక్షిణాదిన బలపడటానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటిదాకా రజినీ పార్టీ పేరు కూడా ప్రకటించలేదు.

అటువంటి తరుణంలో సొంతంగా వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా… రజినీకాంత్ వరుసగా సినిమాలు చేస్తుండడం గమనార్హం. దీనితో ఆయనకు అసలు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా అనే అనుమానాలు కూడా అక్కడి ప్రజలలో ఉన్నాయి.