2021 వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలలో చాలా మంది సినిమా నటులు బరిలో ఉండటం విశేషం. ఇటీవలే కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కుష్బూ ఈ ఎన్నికలలో పోటీ చేస్తారట. రెండేళ్ల క్రితం పార్టీ స్థాపించిన కమల్ హస్సన్ కూడా ఈ ఎన్నికలలో పోటీ చెయ్యనున్నారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, కొన్ని ఉపఎన్నికలలో కమల్ పార్టీ పోటీ చేసింది. తమ అభ్యర్థులకు ప్రచారం చెయ్యడం వరకే కమల్ పరిమితం అయిపోయారు. అయితే ఈ సారి తాను పోటీ చేస్తా అని ప్రకటించారు. ఎక్కువగా చదువుకున్న వారు ఉండే చెన్నై నుండి ఆయన అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మరో వైపు ఈ నెల 31న రజినీకాంత్ సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఆయన కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే… సినీ హీరో విశాల్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు. విశాల్ ఇదివరకే నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేసి, చివరి క్షణంలో నామినేషన్ను ప్రతిపాదించిన పదిమందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పోటీ చేయలేకపోయారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నగర పరిధిలోని ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలని విశాల్ నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి తమిళనాట ఎన్నికలలో తరాల సందడి ఎక్కువగానే ఉండేలా ఉంది.