జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందన్న విషయం స్పష్టం. అయితే దీనిని ఎవరు పూరిస్తారా? అని ఎదురుచూస్తున్న ప్రజలకు, ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ వేస్తున్న అడుగులు కాస్త ఊరటనిస్తున్నాయి. ‘అసలు రాజకీయాలకు తాను దూరం’ అంటూ మొన్నటివరకు స్పష్టంగా చెప్పిన రజనీ స్వరంలో మార్పు రావడంతో, ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నారన్న విషయం బలంగా ప్రచారం జరుగుతోంది.
రజనీ ఎంట్రీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ అందరూ అనుకున్నట్లుగా పోలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే బిజెపిలో చేరుతారా? లేక సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటారా? అంటూ తమిళనాడు ప్రజానీకం చర్చించుకుంటున్నారు. అలాగే కమల్ హాసన్ తో సహా చాలామంది ప్రముఖ సినీ సెలబ్రిటీలు తమ తమ భావాలను మీడియా వేదికలుగా పంచుకుంటున్నారు. ఇలా సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో… రజనీ సోదరుడు కూడా స్పందించారు.
రాజకీయాలలో అవినీతిని అంతమొందించడానికి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని స్పష్టం చేసారు సత్యనారాయణరావు గైక్వాడ్. తన తమ్ముడు రజనీ రాజకీయ ప్రవేశం చారిత్రాత్మక అవసరం అని, పార్టీ పేరు, గుర్తు, అజెండాలపై జూలైలో స్వయంగా రజనీకాంతే ప్రకటన చేస్తారని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే సన్నిహితులు, అభిమానులతో చర్చలు పూర్తయ్యాయని స్వయంగా రజనీ సోదరుడే చెప్పడంతో, ఇది అధికారిక ప్రకటనగానే భావించి రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.