ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక చింతన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..! అవకాశం చిక్కినప్పుడల్లా హిమాలయాలకు వెళ్ళిపోయే రజనీ భక్తి భావం అభిమానులకు తెలిసిన విషయమే. ఆ భక్తిని మరో సారి చాటుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. తాజాగా జరుగుతున్న కృష్ణానదీమ్మ పుష్కరాల వేడులలో భాగస్వామి అయ్యి, పుణ్య నదిలో పుష్కర స్నానం ఆచరించాలని నిర్ణయించుకున్నారు.
అయితే, సూపర్ స్టార్ ఏ ప్రాంతానికి, ఏ ఘాట్ కు రానున్నారో తెలుసా? భక్తుల రద్దీ అధికంగా ఉంటూ, వీఐపీలు వెల్లువలా వచ్చే విజయవాడకో లేదా శ్రీశైలానికో కాదు. పెద్దగా పేరు లేని గుంటూరు జిల్లా అచ్చంపేట వద్దకు. ఈ జిల్లాలోని అచ్చంపేట మండలంలోని చింతపల్లిలో చాలామందికి తెలియని ఓ దివ్యక్షేత్రం కొలువు తీరి ఉంది. అదే విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రం.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్షేత్రానికే విచ్చేయనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీకి సూపర్ స్టార్ రాకకు సంబంధించిన వర్తమానం కూడా అందింది. రజనీ రాకతో ఈ క్షేత్రానికి మరింత పేరు వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. ఒక్క పేరే కాదు, రజనీ వచ్చి వెళ్ళిన నాటి నుండి ఆ ఘాట్ కు భక్తుల రాక కూడా క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.