Rajamouli RRR movie telugu press meetట్రైలర్ రిలీజ్ రోజు నాడు విపరీతమైన అభిమానుల రాకతో రద్దయిన ప్రెస్ మీట్ ను ఈ రోజు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నిర్వహించింది. తారక్, చరణ్ లతో పాటు హీరోయిన్ అలియా భట్, నిర్మాత దానయ్య మరియు దర్శకుడు రాజమౌళి హాజరైన ఈ ప్రెస్ మీట్ లో సరైన ప్రశ్నలను అడగడంలో విఫలమయ్యారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా వందల కోట్లతో నిర్మాణం గావించి, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిత్రీకరించి, ట్రైలర్ కూడా రిలీజ్ చేసి మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీంను ఎన్ని ప్రశ్నలు వేయొచ్చు. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేయొచ్చు. కానీ ఈ ప్రెస్ మీట్ అందుకు వేదిక కాలేదు.

బోరింగ్ అండ్ రొటీన్ ప్రశ్నలతో అటు సినిమా టీంకు, ఇటు చూసే ప్రేక్షకులకు అసహనానికి గురయ్యేలా చేసారు. ఒకానొక ప్రశ్న అయితే… బాలీవుడ్ లో అలియా భట్ ను ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్ననే రిపీట్ చేయడంతో, ‘అక్కడ ప్రశ్నలు ఇక్కడ కాపీ కొట్టకూడదు, ఇక్కడవి అక్కడ కాపీ కొట్టాలి’ అంటూ రాజమౌళి పంచ్ వేసిన పరిస్థితి నెలకొంది.

ఆసక్తికరమైన ప్రశ్నలను అడగలేకపోతున్న మీడియా ప్రముఖుల దయనీయతను చూసి స్వయంగా రాజమౌళినే హీరోయిన్ అలియా భట్ కు ప్రశ్న వేశారు. అలా ఈ ప్రెస్ మీట్ మొత్తాన్ని జక్కన్నే తన భుజస్కంధాల పైన వేసుకుని, మీడియా వర్గాలు అడిగిన అన్ని బోరింగ్ ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఓ మీడియా ప్రతినిధి టికెట్ ధరలపై దానయ్యను ప్రశ్నించారు. ఏపీలో టికెట్ ధరల కోసం ఎన్టీఆర్ సన్నిహితులు ఏపీలో అధికారంలో ఉన్నారు గనుక, ఎన్టీఆర్ ను ఏమైనా ఉపయోగించుకుంటారా? అంటూ ఇరుకున పెట్టే విధంగా మాట్లాడడం అసందర్భంగా మారింది.

ఈ ప్రశ్నకు తారక్ కూడా తన అసహనపు హావభావాలను ప్రదర్శించారు. తారక్ & చరణ్ లాంటి హీరోలు దొరికితే జక్కన్న “ఆర్ఆర్ఆర్” ఎంత అద్భుతంగా అయితే తీశారో, ఈ చిత్ర యూనిట్ అంతా దొరికినపుడు అంత అద్భుతమైన, అబ్బురపరిచే ప్రశ్నలు వేయాల్సింది పోయి, నీరసపు ప్రశ్నలతో మొత్తం ప్రెస్ మీట్ ను నీరుగార్చేసారు.

బహుశా ఇది చరణ్ – జక్కన్న – తారక్ లకు కూడా అర్ధమైంది అనుకుంటా… అందుకే ప్రెస్ మీట్ కి హైలైట్ నిలిచే విధంగా చివరిలో ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ వీక్షకులను ఆహ్లాదపరిచారు. రాజమౌళిని తారక్ గిల్లడం, అలాగే తారక్ ని చరణ్ గిల్లడం వంటి అల్లరి చేష్టలే అభిమానులకు గుర్తులుగా నిలిచాయి.

ఈ మొత్తం ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య గారు చెప్పింది ఒక్కటే ఒక్క వ్యాఖ్యం… ‘ఏపీ ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నాం, త్వరలోనే సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నాం’ అంటూ పలికారు. గత మూడు ప్రెస్ మీట్స్ దానయ్య చెప్పిన ‘ఆల్ ది బెస్ట్’ ఇక్కడ మిస్సయ్యింది!

https://twitter.com/ReyB22/status/1469526577620738049

https://twitter.com/dpveu_official/status/1469544374795059200